Monday 7 May 2012

బాపూజీకొక లేఖ

బాపూజీకి ఒక భారత పౌరుడు రాయునది....


భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రీమించుటలేదు, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద చూసి నేను గర్వపడుట లేదు....................................................................................................


బాపూ....

భారతిని తెల్లదొరలు చెరబట్టి 250 సంవత్సరాలు కసితీరా అనుభవించాక అహింస పేరు చెప్పి వాళ్ళని బాబు బాబు అని బ్రతిమాలి వారి చేతినుంచి విడిపించి మువ్వన్నెల పైట కప్పి మాకప్పగించావ్...

నువ్వు వాళ్ళకే వదిలేస్తీ కనీసం ఆమె పాతివ్రత్యమైనా మిగిలేదేమో...మమ్మల్ని నమ్మి మా చేతిలో పెట్టి పోయావ్...మా వాళ్ళు నువ్వు నీ స్వంత చేతులతో నేసి ఇచ్చిన "అహింస" అనే తెల్ల దుప్పటి కింద చేస్తున్న దారుణాలు అన్నీ, ఇన్నీ కావు...నువ్వు అప్పగించింది మొదలు ఈ రోజు వరకూ భారతికి అనుక్షణం మానభంగం జరుగుతూనే వుంది...

ఎప్పటినుంచో రాద్దామనుకున్నాను నీకు ఈ లేఖ...సరైన సమయం రాలేదు..ఈరోజు ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం కదా...అందుకే రాస్తున్నాను...మన తెలుగు నిఘంటువుల ప్రకారం హింసకు పాల్పడే, నరబలిని కోరుకునే, మతం మత్తులో పసిపాపను సైతం మసి చీసీ వాళ్లకి మనం పెట్టుకున్న పేర్లు "ఉగ్రవాది","తీవ్రవాది","హింసావాది","ఉన్మాది"....ఇంకా ఏవో....వీటన్నిటికీ వ్యతిరేక పదం "అహింసావాది" అంటున్నారు...మరి వీళ్లందర్నీ ప్రేరేపించే వ్యక్తి రాజ్యసభలో నీ చిత్రపటం ముందు కూర్చుని నేను అహింసావాదిని అని చెప్పుకుంటున్నాడు...అందుకే నాకది పర్యాయ పదం లా కనపడుతుంది..

అడవుల్లోనూ, అజ్ఞాతంలోనూ ఉండి అప్పుడప్పుడూ వచ్చి అరాచకాలు చేస్తున్న వాళ్ళనే తీవ్రవదులు,ఉగ్రవాదులు అంటున్నారు...వాళ్ళు చేసేదే హింస అంటున్నారు...

తెల్లవారితే నీ పాటలే నేర్పే మాష్టారు అభం,శుభం తెలియని ఆడపిల్లని చెరచడానికి చూస్తాడు...
మా నాన్న కూడా పుట్టలేదంట ఈ వరకట్న నిరోధక చట్టం వచ్చేసరికి,
మొన్నే కట్నం కోసం నిండుచూలాల్ని నిలువెత్తునా నిప్పంటించి చంపేశారు అత్తా,మావలు...
ఒక పన్నెండేళ్ళ పిల్ల ఆసుపత్రికొచ్చింది..తనకి పుట్టబోయే బిడ్డ వాళ్ళ నాన్నదో, అన్నదో చెప్పమని...
మూడు లక్షల రూపాయల ఆస్తి కోసం భార్యతో కలిసి, కన్న తల్లిదండ్రులని కడతేర్చాడొకడు..ఇంకా ఎందరో....
చెప్పుకుంటూ పోతే ఈ లేఖ పూర్తయ్యే లోపు నా ఆయుష్షు నిండిపోతుంది..
వీళ్ళందరికీ ఇంకా ఏ పేర్లూ పెట్టలేదు...మనుషులు అనే పిలుస్తున్నారు..
వీళ్ళకి ఏ హానీ జరగకుండా మన రక్షక భటులు బంధించి రక్షకభట నిలయాలుగా చెప్పబడే విడిది గృహాలలో చేర్చారు...వాళ్ళకి శిక్ష విధించడానికి వీల్లేదు...ఒకవేళ శిక్ష వేద్దామనుకున్నా,
మానవహక్కుల సంఘం వాళ్ళు నీ చిత్రపటాలు చేతిలో పట్టుకుని రోడ్డెక్కి వాళ్లకి అండగా నిలబడతారు..

భావి పౌరులుగా చెప్పబడ్డ నేటి యువతరం...
ప్రియురాలి ప్రేమలోనూ...
రోడ్డు పక్క కారులో పడుపుకత్తె కౌగిలిలోనూ..
మధుశాలల్లోనూ, మత్తులోనూ...
పరాయిదేశాలకి సంపాదించి పెట్టే పనిలోనూ..
పీకల్లొతు వరకు మునిగి ఉన్నారు...

నా భారతి నగ్నంగా నడివీధిలో నిలబడి ఉంది..నువ్వు కప్పిన మువ్వన్నెల జెండా రాజకీయ నాయకులు, స్వార్ధపరులు ఎప్పుడో ముక్కలు ముక్కలుగా చింపేసారు..కొన్ని వందల సంవత్సరాలుగా తనకి జరుగుతున్న ఈ దారుణాన్ని భరించలేక ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటుందో అని భయపడి జాతిపితవయిన నీకు ఈ లేఖ రాస్తున్నాను...

ఒక్కసారి రా... అహింస పేరుతో జరుగుతున్న హింసకి చరమగీతం పాడు..మా చేతికి ఈటెలు, కత్తులూ ఇచ్చి వెళ్ళు..ధనార్జన కోసం జరుగుతున్నదారుణ మారణ క్రీడలో వంద నోటు మీద ముద్రించబడ్డ నీ మొహం ఎప్పుడో రక్తంతో తడిసిపోయింది..వచ్చి వాటిని తగలబెట్టి వెళ్ళు..క్రూరమృగాల కొమ్ము కాస్తున్న ఈ పనికిమాలిన చట్టాలని తిరగరాసి వెళ్ళు. నువ్వు ఎగరేసి వెళ్ళిన శాంతికపోతం రెక్కలు పీకి, చంపుకు తినేసారు...ఈ నాటి ఈ హింసాకాండకి ఆనాటి నీ అహింసాసూత్రమే కారణమని చెప్పి వెళ్ళు...

నువ్వు అందరు దేవుళ్ళు ఒక్కటే అన్నావు...కొన్ని మతాలేమో హింస మహా పాపం అని చెబుతున్నాయి...కొన్ని మతాలేమో పరుల హింసే పరమ సోపానం అని చెబుతున్నాయి..నీకు ఏ దేవుడు తీర్పిచ్చాడో నాకు తెలియదు...అందుకే ఈ లేఖ నరకానికొక కాపీ స్వర్గానికొక కాపీ పంపిస్తున్నాను...అందుకున్న వెంటనే వస్తావు కదూ...

No comments:

Post a Comment