(బళ్ళో కాదురా ప్రకృతి మాత ఒళ్ళో)
నాన్నా నిన్ను బళ్ళో వెయ్యను....
ఎందుకంటావా ....చెప్తా విను
నీ మెడలు వంచి
వంకర గీత మీద వంద సార్లు దిద్దించి తల ఎత్తుకు తిరిగే పౌరుషాన్ని ఆదిలోనే పాతిపెట్టేస్తారు
రాంకుల రేసులో ముందుకు పరుగెత్తించి
జీవితం రేసులో మాత్రం వెనక్కి నెట్టేస్తారు..
సరస్వతీ నిలయాలన్నీ ధనలక్ష్మీ కొలువులయిపోయాయి..
చదువుకోవడం లేదు ఇప్పుడంతా చదువు కొనడమే
వ్రాయించి, అరిపించి, గీయించి, �వేధించి నిన్ను యంత్రాన్ని చేస్తారు..
ఆడించి, పాడించి, బుజ్జగించి నేను మనిషిని చేస్తాను...
ఆ నాలుగు గోడల మధ్యలో స్వేద దుర్గంధాలు పీల్చే దౌర్భాగ్యం నీకొద్దు
పరిమళ సుగంధాలు మోసే మలయ మారుతాలు పీల్చి తరిందువు గాని
ఉదయాన్నే వికసించి సాయంత్రానికి వాడే పొద్దు తిరుగుడులా చూడలేను నిన్ను
అనునిత్యం ప్రకాశించే , వెలుగుల్ని ప్రసాదించే భానుమూర్తిని చేస్తాను
ఆయాకేమి తెలుసు రా ఆకలెప్పుడేస్తుందో నీకు
ఆ మేడమ్ కేం తెలుసురా నిద్దరెప్పుడొస్తుందో నీకు
నే కోల్పోయిన బాల్యాన్ని నీతో కలిసి అనుభవిస్తాను అందుకే నాన్నా బళ్ళో కాదు ప్రకృతి మాత ఒళ్ళో వేస్తాను నిన్ను..
_ మోహన్ తలారి
(To my son Dharanee priyatham)
No comments:
Post a Comment